ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP, ODISHA CS's Meeting: ఏపీ, ఒడిశా సీఎస్‌లు వర్చువల్ మీటింగ్.. ఆ సమస్యలపై చర్చ.. - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

AP, ODISHA CS's Meeting: ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య సుదీర్ఘంగా ఉన్న వివిధ అంతర్‌ రాష్ట్ర అంశాల పరిష్కారానికి.. మరో అడుగు ముందుకు పడింది. అపరిష్కృత సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు తొలిసారిగా వర్చువల్‌గా సమావేశం అయ్యారు. పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్ధిష్ట వ్యవధిలోగా.. ఆయా వివాదాలకు ఓ పరిష్కార మార్గాన్ని కనుగొనాలని తీర్మానించారు.

AP, ODISHA CS's Meeting virtually
AP, ODISHA CS's Meeting virtually

By

Published : Jan 11, 2022, 2:31 AM IST

AP, ODISHA CS's Virtual Meeting:అంతర్రాష్ట్ర అంశాల పరిష్కారం కోసం.. ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాల చర్యలు ప్రారంభించాయి. ఇరురాష్ట్రాల మధ్యన నెలకొన్న సమస్యలను నిర్ధిష్ట వ్యవధిలోగా పరిష్కరించుకునే విషయమై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, నవీన్ పట్నాయక్ గతంలో భువనేశ్వర్‌లో భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో.. సోమవారం ఏపీ సీఎస్ సమీర్ శర్మ., ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర, ఇతర ఉన్నతాధికారులు వర్చువల్‌గా భేటీ అయ్యారు. సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య.. ఎనర్జీ,నీటి వనరులు, ఉన్నత విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు.

జోలాపుట్ డ్యాం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, లోయర్ మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు.., బలిమెల డ్యాం , చిత్రకొండ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు సంబంధించి పరిష్కరించుకోవాల్సిన అంశాలపై సమాలోచనలు చేశారు. వంశధార నదిపై నేరెడి బ్యారేజి.., ఝంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్టు, బహుదా నది నీరు విడుదలకు సంబంధించి.. పంపు స్టోరేజి ప్రాజెక్టులకు ఇరు రాష్ట్రాల తరుపున ఎన్ఒసిలు మంజూరు అంశాలపై సమీక్షించారు.

అంతర్ రాష్ట్ర ఒప్పందానికి అనుగుణంగా బలిమెల పంపు స్టోరేజికి.. బలిమెల హై హెడ్ పవర్ హౌస్ నుంచి నీటిని విడుదల చేయరాదని.. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి పేర్కొన్నారు. నేరడి బ్యారేజి నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం 106 ఎకరాల భూమిని అప్పగించాల్సి ఉందని జాయింట్ సర్వే చేపట్టి త్వరితగతిన భూమిని అప్పగిస్తే.. బ్యారేజీ సకాలంలో పూర్తై ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని సమావేశం దృష్టికి తెచ్చారు.

అదే విధంగా ఝంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణంలో సబ్ మెర్జ్ ఏరియాకు సంబంధించి జాయింట్ సర్వే పెండింగ్లో ఉందని ఏపీ జలవనరుల శాఖ అధికారులు వివరించారు. పలుమార్లు విజ్ణప్తి చేసినా ఒడిశా ప్రభుత్వం ఇంత వరకూ ఆ ప్రాంతంలో గ్రామ సభలు నిర్వహించలేదని, ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఒప్పందం ప్రకారం బహుదా నది ద్వారా.. ఒడిశా ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవటంతో ఏపీ రైతులు నష్టపోతున్నట్లు సమావేశం దృష్టికి తెచ్చారు.

శ్రీకాకుళంలోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, ఒడిశాలోని బెరహంపూర్ విశ్వవిద్యాలయాల్లో ఒడియా,తెలుగు భాషలను ప్రవేశపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. రవాణా శాఖకు సంబంధించి ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ఒప్పందానికి అనుగుణంగా.. చర్యలు చేపడదామని రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒడిశా సరిహద్దులో కొటియా గ్రూప్ ఆఫ్ విలేజిస్ అంశాలపై సంబంధిత జిల్లా కలక్టర్ల వద్ద ఉన్న మ్యాప్‌ల ఆధారంగా జిల్లా స్థాయిలోనే.. పరిష్కరించుకునేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందని ఇరు రాష్ట్రాల సీఎస్‌లు అంగీకరించారు. పెండింగ్ అంశాలను సంప్రదింపుల ద్వారా త్వరితగతిన పరిష్కరించుకునేందుకు కృషి చేద్దామని ఒడిశా సీఎస్ సురేశ్ చంద్ర మహాపాత్ర సూచించారు. ఈ సమావేశపు మినిట్స్ ను.. రెండు రాష్ట్రాలు సిద్ధం చేసి పంపితే తదుపరి సమావేశాల్లో.. పెండింగ్‌ అంశాలపై చర్చించేందుకు అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:TFPC: ఎమ్మెల్యే నల్లపురెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి: టీఎఫ్​పీసీ

ABOUT THE AUTHOR

...view details