భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) దేశంలోని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువైద్యం, ఉద్యాన రంగాలకు చెందిన 67 విశ్వవిద్యాలయాలకు 2019 సంవత్సరానికి గాను ర్యాంకులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జాతీయస్థాయిలో 13వ ర్యాంకు లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 34వ ర్యాంకు లభించింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి 64వ ర్యాంకు వచ్చింది.
తెలంగాణలో
తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 10వ ర్యాంకు, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి 33వ ర్యాంకు లభించింది. ఐకార్ ర్యాంకింగ్ ఆఖరి స్థానంలో(67వ ర్యాంక్) పి.వి.నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం నిలిచింది. 2019 సంవత్సరంలో ఆయా విశ్వవిద్యాలయాలు విద్యాబోధన, పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలు, విద్యార్థులు-అధ్యాపకుల ప్రతిభ, అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో సాధించిన గుర్తింపు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటించారు.
ఇదీ చదవండి :లోక్సభలో వైకాపా తీరు.. రైతు ద్రోహమే: చంద్రబాబు