‘గత ప్రభుత్వాల్లో ఇచ్చిన ఇళ్లకు సంబంధించి సుమారు 60లక్షల మందికి శాశ్వత నివాస హక్కు కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆలోచిస్తున్నారు. ఇందుకు విధి విధానాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana on tidco houses) తెలిపారు. వచ్చే డిసెంబరు నాటికి 80వేల టిడ్కో ఇళ్ల(tidco houses)ను లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం, సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి బొత్స విలేకరులతో మాట్లాడారు. ‘పరిషత్ ఎన్నికల్లో వచ్చిన ప్రజాతీర్పుతో రాష్ట్రంలో తెదేపా, చంద్రబాబు పనైపోయింది. ప్రజల్లో వారికి మనుగడ లేదు.. ఓటమి భయంతోనే తెదేపా ఎన్నికల మధ్యలో అస్త్ర సన్యాసం చేసింది’ అని బొత్స ఆక్షేపించారు.
ఈ ఫలితాలు సరైనవి కావని ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని అచ్చెన్నాయుడు అంటున్నారని విలేకరులు గుర్తుచేయగా బొత్స స్పందిస్తూ..‘అచ్చెన్నాయుడు తెలియక మాట్లాడుతున్నారు. ఆయనను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమనండి, మంత్రిగా నేను రాజీనామా చేస్తా.. ఇవేమైనా కుస్తీ పోటీలా ఇలా మాట్లాడుకోవడమనేది రాజకీయాల్లో మన స్థాయిని తగ్గించుకోవడమే అవుతుంది’ అని అన్నారు. చంద్రబాబును చంపడానికి వైకాపా ఎమ్మెల్యే వెళ్లారంటున్నారు కదా అని విలేకరులు అడగ్గా..‘అలాంటి మనస్తత్వం, క్రిమినల్ మైండ్సెట్ చంద్రబాబుకే ఉంది’ అని బొత్స వ్యాఖ్యానించారు.