గుజరాత్ నుంచి బస్సులు వస్తోన్న మత్స్యకారులు విజయవాడకు చేరుకున్నారు. 12 బస్సుల్లో 887 మందిని ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చింది. కృష్ణా జిల్లా ఎనికేపాడులో మంత్రి మోపిదేవి వెంకటరమణ మత్స్యకారులకు ఆహారం, మంచినీరు అందజేశారు. ఎనికేపాడు నుంచి నేరుగా మత్స్యకారుల స్వస్థలాలకు బస్సులు వెళ్లనున్నాయి. జిల్లాలకు చేరుకున్న వారిని స్థానికంగా ఏర్పాటుచేసిన క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
లాక్డౌన్ కారణంగా తిండి లేక నరకయాతన అనుభవించామని మత్స్యకారులు వాపోయారు. కొంతమంది చనిపోవడం బాధ కలిగించిందన్నారు. స్వగ్రామాలకు చేరుకుంటామో లేదోనని ఆందోళన చెందామన్నారు. సీఎం, అధికారులు చేసిన సాయం వల్లే సొంత ప్రాంతాలకు వెళ్తున్నామని మత్స్యకారులు చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు.