By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 20, 2024, 3:27 PM IST
|Updated : Mar 20, 2024, 5:23 PM IST
శ్రీకాకుళంలో భారీ వర్షం- ఉరుములు, పిడుగులతో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం
Heavy Rain with Thunder, Lightning in Narasannapeta : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తామరపల్లిలో విద్యుత్ స్తంభంపై పిడుగు పడింది. పిడుగుపాటుతో విద్యుత్ వైర్లు, స్తంభం పూర్తిగా ధ్వంసం అయ్యాయి. విద్యుత్ స్తంభం సమీపంలోని ఇళ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో సమీపంలోని వరిగడ్డి కుప్పలు దగ్దమయ్యాయి
Narasannapeta in Srikakulam District : తుపాను ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమైంది. ఉదయం ఎండ ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి వాతావరణం మారిపోయింది. అకాల వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షం పడటం వల్ల రైతన్నలు పంటలను కాపాడుకునేందుకు నానాకష్టాలు పడ్డారు. పొలాల్లో కుప్పలుగా ఉంచిన నువ్వు, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీడి, మామిడి పంటలకు ఈ వాన కొంతమేర ఉపకరిస్తుందని వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు.