తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ, హైదరాబాద్‌ రైజింగ్‌ ఆగదు : సీఎం రేవంత్ రెడ్డి - HCL TECH NEW CAMPUS IN HYDERABAD

హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్‌ టెక్‌ కొత్త క్యాంపస్ - ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

HCL Tech New Campus
HCL Tech New Campus (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2025, 1:39 PM IST

HCL Tech New Campus : హైదరాబాద్‌లోని మాదాపూర్​లో హెచ్‌సీఎల్‌ టెక్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. తాము ప్రతి రోజూ బహుళజాతి సంస్థలతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడమో, పెద్ద సంస్థలు తెలంగాణకు రావడమో, గత సంవత్సరం సంతకం చేసిన ఎంఓయూల కొత్త సౌకర్యాలను ప్రారంభించడమో జరుగుతోందని అన్నారు. హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్‌ టెక్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్రానికి దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెబుతున్నామన్నారు. ఉద్యోగ కల్పనలో నెంబర్‌ వన్​గా నిలిచామన్నారు. తమ దగ్గర అత్యధిక ఏఐ, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నాయని చెప్పారు. తెలంగాణను వన్‌ ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తామని ముందు చెప్పినప్పుడు అది సాధ్యం కాదని కొందరు అన్నారని పేర్కొన్నారు.

రెండుసార్లు దావోస్‌ పర్యటనల్లో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారని సీఎం రేవంత్‌ వివరించారు. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరన్నారు. తమ పోటీ ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నైతో కాదని తాను చెప్పినప్పుడు కొంత మంది అది పెద్ద కలనే అవుతుందని ఎద్దేవా చేశారన్నారు. ఈవీ అడాప్షన్‌లో హైదరాబాద్‌ను నంబర్‌ వన్‌గా చేశాక, రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్‌ ఎనర్జీ, లైఫ్‌ సైన్సెస్‌, బయోటెక్నాలజీ, స్కిల్స్‌, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్‌కు హబ్‌గా మారుస్తామని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ రైజింగ్‌ ఆగదు :ఇప్పుడు హైదరాబాద్‌ రైజింగ్ ఆగదని ప్రజలు అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాను మొదట తెలంగాణ రైజింగ్‌, హైదరాబాద్‌ రైజింగ్‌ అని చెప్పినప్పుడు కొందరికి కచ్చితంగా తెలియదు, ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోందని ఆనందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్‌ను కొద్దిరోజుల క్రితం ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. తాము ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాలలో ఒకటైన బయో ఆసియాను నిర్వహించామని, ఇవాళ హెచ్‌సీఎల్‌లో ఉన్నామని తెలిపారు.

"గ్లోబల్ కంపెనీగా హెచ్‌సీఎల్ టెక్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇది 60 దేశాలలో ఆపరేట్ చేస్తోంది. 2.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్, ఏఐ రంగాల్లో వరల్డ్ క్లాస్ ఆఫరింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. 2007లో హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అంచెలంచెలుగా HCLపెద్ద స్థాయికి ఎదిగింది. ఇవాళ 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 5 వేల మందితో కేఆర్ సీలో ప్రపంచస్థాయి సదుపాయంతో హెచ్‌సీఎల్ టెక్ హైదరాబాద్‌లో గొప్ప పనులు చేస్తుంది." - రేవంత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి

ముగిసిన బయో ఆసియా సదస్సు - రూ.5,445 కోట్ల పెట్టుబడులు - 10వేల కొత్త ఉద్యోగాలు

ఎక్కడికైన సులువుగా తీసుకెళ్లే రక్తపరీక్షల సూట్​ కేస్ - డీఎన్​ఏ టెస్ట్​ చేసే మినీ యంత్రం

ABOUT THE AUTHOR

...view details