CII Response on Allocations for AP in Union Budget 2024 : విభజన అనంతరం గత పదేళ్లలో ఈసారి కేంద్ర బడ్జెట్లో జరిగిన కేటాయింపులు రాష్ట్రానికి ఊరట కలిగించేవిగా ఉన్నాయని భారత పరిశ్రమల సమాఖ్య ఏపీ చాప్టర్ అభిప్రాయపడింది. అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పూర్తి, వెనుకబడిన జిల్లాల ప్రగతికి చేయూత, పారిశ్రామిక అభివృద్ధి నడవాకు సహకారం తదితర నిర్ణయాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సహకారం ఉందనే సంకేతాన్ని ఇచ్చిందని పేర్కొంది. చిన్న మధ్యతరహా పరిశ్రమలతోపాటు ఖాయిలా పరిశ్రమలు తిరిగి తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు అనువైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చేలా ఈ బడ్జెట్ ఉందని కితాబిచ్చింది.
ఆక్వా రంగంలో పన్నుల రాయతీ వల్ల పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాల మెరుగుదల, వేతన జీవులకు పన్నుల ఊరట వంటివి ఆహ్వానించదగిన నిర్ణయాలుగా అభివర్ణించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించడమే కాకుండా నిదులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం శుభపరిణామంగా పరిశ్రమ ప్రకటించింది.
కేంద్ర బడ్జెట్ను ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్వాగతించింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతమిచ్చేందుకు పరిశోధన, వంగడాల విడుదల విషయంలో దృష్టి సారించిందని- ఏపీ ఛాంబరు ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు అన్నారు. పారిశ్రామిక రంగం ముందుకు తీసుకెళ్లేందుకు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామంగా పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది 15 వేల కోట్లు రూపాయలు కేటాయించడం, దేశీయ విదేశీయ ఏజెన్సీల ద్వారా ఆర్థిక వనరులను రాజధాని నిర్మాణానికి సమకూరుస్తామని ప్రకటించడం, పోలవరం నిర్మాణానికి అవసరమైన పూర్తి నిధులను సమకూరుస్తామని పేర్కొనడం సానుకూల అంశాలన్నారు.