Fake Doctors in GHMC : హైదరాబాద్ నగరం నకిలీ వైద్యులకు అడ్డాగా మారుతోంది. అర్హత లేకున్నా నాడి పట్టి నకిలీ వైద్యులుగా చెలామణి అవుతున్నారు. మరోవైపు రోగుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇలా మాయగాళ్లు మహానగర వ్యాప్తంగా విస్తరించారు. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఇప్పటివరకు 100 మంది ఫేక్ డాక్టర్స్ గుట్టు బయటపడింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో ఎలాంటి ఎంబీబీఎస్ ఇతర వైద్య పట్టాలు లేకుండానే ప్రాక్టీస్ చేస్తున్నట్లు నిర్ధారించారు.
కొన్ని ఉదాహరణలు :
- డెంటల్ డిగ్రీ పొందిన ఓ వైద్యురాలు నాగోలులో ఎస్జేఎం పేరుతో క్లినిక్ తెరిచింది. అక్కడ ఏకంగా చర్మ వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. డెర్మటాలజిస్టులు చేయాల్సిన కాస్మటాలజీ వైద్యం, హెయిర్ ట్రాన్స్పాంట్ ఈమె చేస్తున్నట్లు అధికారుల సోదాల్లో తేలింది.
- తిరుమలగిరిలో శ్రీసాయి క్లినిక్ పేరుతో ఓ నకిలీ వైద్యుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోగులకు యాంటిబయోటిక్ ఇంజక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నాడు. అతనిపై కేసు నమోదు చేశారు.
- విదేశాల్లో ఎంబీబీఎస్కి సమానమైన వైద్యవిద్యను ఓ వ్యక్తి అభ్యసించాడు. ఇక ఏకంగా ఎండీ బోర్డు పెట్టి, చర్మ వ్యాధి నిపుణుడిగా చలామణి అవుతున్నారు.
కాస్త అనుభవంతో :డాక్టర్లుగా చెలామణి అవుతున్న ఈ నకిలీ వైద్యుల వద్ద ఎలాంటి పట్టాలు లేవు. కొందరు నకిలీ పట్టాలు సృష్టించి వాటిని లామినేషన్ చేయించి క్లినిక్ల్లో పెడుతున్నారు. మరి కొందరైతే ఏవో గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు కొనుగోలు చేసి డాక్టర్లుగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. మెడికల్ షాప్స్ కూడా పెట్టించి అనుమతులు లేకుండానే మెడిసిన్స్ విక్రయిస్తున్నారు. దాదాపు 140 వరకు ఇలాంటి దుకాణాలను ఔషధ నియంత్రణశాఖ నిర్ధారించింది.
హోల్సేల్ డీలర్లు సైతం ఇలాంటి క్లినిక్లకు మెడిసిన్స్ సరఫరా చేస్తున్నారు. బస్తీలు, మురికి వాడలను లక్ష్యంగా చేసుకొని క్లినిక్లను తెరుస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్ ఫీజులు రూ.500 నుంచి రూ.1500 వరకు ఉండటంతో ఈ నకిలీ వైద్యులు రూ.50, రూ.100 వసూలు చేస్తుండటంతో పేదలు ఎక్కువ మంది వీటిని ఆశ్రయిస్తున్నారు.