Bangladesh Anti Hindu Violence : బంగ్లాదేశ్లో మైనారిటీలు, హిందువులపై దాడులు జరుగుతున్నట్లు ఎట్టకేలకు బంగ్లాదేశ్ అంగీకరించింది. వివిధ అంతర్జాతీయ నివేదికలు బంగ్లాదేశ్లోని హిందువులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నట్లు వెల్లడిస్తున్నా, ఇన్నాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న బంగ్లా ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగినట్లు అంగీకరించింది. వీరిలో ముఖ్యంగా హిందువులకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.
హిందువులపై హింసాత్మక దాడులు జరిగినమాట వాస్తవమే: బంగ్లాదేశ్ - BANGLADESH ANTI HINDU VIOLENCE
ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో హిందువులు సహా మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు - ఎట్టకేలకు అంగీకరించిన బంగ్లాదేశ్

Published : Dec 10, 2024, 10:42 PM IST
కంటితుడుపు చర్యలు!
మతపరమైన హింసాత్మక ఘటనల కేసుల్లో 70 మందిని అరెస్టు చేసినట్లు బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలమ్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో మరిన్ని ఘటనలు, అరెస్టులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ సంఖ్యమరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. అక్టోబర్ 22 తర్వాత చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
భారత్ ఆందోళన
హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని భారత్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్కు తెలియజేశారు. ఢాకా వెళ్లిన ఆయన ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి మహమ్మద్ జషీమ్ ఉద్దీన్తో డిసెంబర్ 9న సమావేశమయ్యారు. తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్తోనూ మిస్రీ భేటీ అయ్యారు. ఈ భేటీ మరుసటి రోజే దాడుల విషయాన్ని బంగ్లాదేశ్ అంగీకరించడం గమనార్హం.