BJP Economic Reform Challenges : మోదీ సర్కార్ గత పదేళ్ల పాలనలో అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి వ్యాపార వర్గాల ఆదరాభిమానాలు పొందింది. ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి, మరిన్ని విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని ఆశించింది. అయితే ఇప్పుడు అదంత సులువుగా జరిగే అవకాశం కనిపించడం లేదు.
ఇకపై కష్టమే!
ప్రస్తుతం బీజేపీ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ప్రధాని నరేంద్ర మోదీ 'అబ్ కీ బార్ ఛార్ సౌ పార్' అని నినాదం ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదు. కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా సొంతంగా రాలేదు. అందుకే ఎన్డీఏ కూటమిలోని మిగతా మిత్రపక్షాలపై కచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పరోక్షంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సంస్కరణలు చేపట్టడానికి పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
గ్లోబల్ మాన్యుఫాక్చురింగ్ హబ్!
భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చురింగ్ హబ్ (అంతర్జాతీయ తయారీ కేంద్రం)గా మార్చాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. దేశీయంగా సెమీకండక్టర్ తయారీ సంస్థలను, ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలను ప్రోత్సహించాలని, ఇందుకోసం భారీ రాయితీలు కల్పించాలని భావించింది. కానీ ఇదంతా చేయాలంటే, విధానపరమైన ఆర్థిక సంస్కరణలు చేయాల్సి ఉంటుంది. మిత్రపక్షాల మద్దతు లేకపోతే ఇది సాధ్యమయ్యే పనికాదు.
కార్మిక చట్టాల ప్రక్షాళన
మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కూడా ప్రక్షాళన చేయాలని ఆలోచిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలకు మరింత స్వేచ్ఛ కల్పించాలని భావిస్తోంది. భారత దేశంలో 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు ప్రత్యేకమైన ప్రతిబంధకాలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ సంస్థలు కొత్త వారిని నియమించుకోవాలన్నా లేదా ఉన్న ఉద్యోగులను తొలగించాలన్నా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. దీని వల్ల డిమాండ్కు అనుగుణంగా ఉద్యోగులను నియమించుకోవడానికి వీలుకాకుండా ఉంది. దీనిని తొలగించాలని మోదీ సర్కార్ భావించింది. ఈ థ్రెషోల్డ్ను 300కు పెంచుతూ పార్లమెంట్లో ఓ చట్టాన్ని కూడా ఆమోదించింది. అయితే దీనికి రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి. ఒకవేళ ముచ్చటగా మూడోసారి కూడా తమ ప్రభుత్వం వస్తే, దీనిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని మోదీ సర్కార్ అనుకుంది. ఇకపై ఇది కూడా కష్టమయ్యే అవకాశం ఉంది.
పన్నుల తగ్గింపు?
దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తున్న కారణంగా భారతదేశంలో తయారీ ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. అందుకే దిగుమతి సుంకాలు తగ్గించాలని బీజేపీ సంకల్పించింది. దేశీయంగా స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, ఇప్పటికే ముఖ్యమైన విడిభాగాల దిగుమతులపై 10 శాతం వరకు సుంకాలు తగ్గించింది. త్వరలో మరిన్ని దిగుమతులపై సుంకాలు తగ్గించాలని భావించింది. కానీ మిత్రపక్షాల మద్దతు లేకపోతే ఇది కూడా కష్టమే.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్?
మోదీ సర్కార్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దాలని ఆశించింది. దాదాపుగా దానిని సాధించింది. ఇప్పుడు ఎన్నికల మ్యానిఫెస్టోలో భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని హామీ ఇచ్చింది. దీనికి కచ్చితమైన దీర్ఘకాలిక ప్రణాళికతో పాటు, గొప్ప ఆర్థిక సంస్కరణలు అవసరం.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుండడం ఒక మంచి పరిణామం. దీనిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు, వ్యవస్థాపక స్ఫూర్తి (entrepreneurial sprit) పెంపొందించడానికి మోదీ సర్కార్ కృషి చేసింది. ఇంకా చాలా ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ మిత్రపక్షాల మద్దతు లేకపోతే ఇది సాధ్యమయ్యే పనికాదు.
వికసిత్ భారత్ 2047
బీజేపీ భారతదేశాన్ని ఒక ఉత్పాదక శక్తిగా మార్చాలని ఆశిస్తోంది. ఇందుకోసం అనేక భూ సంస్కరణలు, కార్మిక సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. చైనాకు పోటీగా భారత ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేయాలని మోదీ సర్కార్ ఆశ. కానీ ఇకపై ఇది చేయడం చాలా కష్టం. ఎందుకంటే?
చైనా 1970ల్లో ఒక చట్టం చేసి, భూయాజమాన్యాన్ని వినియోగ హక్కుల నుంచి వేరు చేసింది. పెట్టుబడిదారులకు పారిశ్రామిక అవసరాల కోసం చాలా సులువుగా భూమిని కేటాయించేలా చేసింది. దీని వల్ల చైనా చాలా తక్కువ కాలంలోనే పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది.
కానీ భారతదేశంలో ఇలాంటి సంస్కరణలు చేపట్టడం అంత సులువు కాదు. భూయజమానుల నుంచి వారి భూమిని తీసుకుని, పారిశ్రామికవేత్తలకు ఇవ్వడం అంత సులువు కాదు. ఒకవేళ ఇలా చేయాలంటే, చాలా కఠినమైన చట్టాలు చేయాల్సి ఉంటుంది. పైగా భూయజమానుల నుంచి, రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఈ విషయంలో మోదీ సర్కార్కు మిత్ర పక్షాలు సహకరించే అవకాశం దాదాపు లేదని చెప్పవచ్చు.