Udhayanidhi Stalin Deputy Chief Minister :తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు. కేబినెట్లో కొత్తగా చేరిన మంత్రులు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులు సెంథిల్ బాలాజీ, డాక్టర్ గోవి చెళియన్, ఆర్ రాజేంద్రన్, ఎస్ఎం నాజర్ చేత గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. సెంథిల్కు విద్యుత్, ఎక్సైజ్ శాఖ, చెళియన్కు విద్యాశాఖ, నాజర్కు మైనార్టీ వ్యవహారాలు, రాజేంద్రన్కు పర్యటక శాఖలను కేటాయించారు. తమిళనాడు రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ డీఎంకే పార్టీ నేతలు, మిత్రపక్షాల నేతలు హాజరయ్యారు.
'విమర్శలకు చేతలతో సమాధానమిస్తా'
అంతకుముందు చెన్నైలోని కరుణానిధి మెమోరియల్ వద్ద ఉదయనిధి స్టాలిన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉదయనిధి- ముఖ్యమంత్రి, మంత్రులు తనకు పెద్ద బాధ్యత అప్పగించారని చెప్పారు. వారి నమ్మకాన్ని కాపాడుకునేలా పనిచేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన విమర్శలపై కూడా స్పందించారు. విమర్శలు ఎప్పుడూ ఉంటాయని, అయితే, వాటన్నింటినీ తీసుకుని సాధ్యమైనంత వరకు ప్రజలకు మంచి చేస్తానన్నారు. తన పనితోనే విమర్శలకు సమాధానమిస్తానని చెప్పారు.
'ఇది ఆత్మగౌరవ క్షణం'
తమిళనాడు అభివృద్ధి కోసం ఉదయనిధి స్టాలిన్ తన బాధ్యతను నెరవేరుస్తారని డీఎంకే మిత్రపక్షం వీసీకే పార్టీ నేత తోల్ తిరుమవలవన్ అన్నారు. మరోవైపు, ఇది ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన క్షణం అని ద్రవిడార్ కళగం పార్టీ అధ్యక్షుడు కే వీరమణి అన్నారు. "ఇలా కుటుంబాల తర్వాత కుటుంబాలు ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటున్నాయి. ఎందుకంటే నేను- నా కుమారుడు, మనవడు అదే సిద్ధాంతాన్ని అనుసరించాలని అనుకుంటాను. ఇది అనర్హత కాదు అదనపు అర్హత" అని వీరమణి చెప్పారు.