Special Lok Adalat At SC : వివాదాలకు సంబంధించి తమ కేసులను కక్షిదారులే స్వచ్ఛందంగా పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్ అదాలత్ సోమవారం నుంచి ప్రారంభమైంది. సుప్రీం కోర్టు 75వ వార్షికోత్సవ సందర్భంగా దీనిని ప్రారంభించారు. ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియలో మొదటగా ఏడు సుప్రీం కోర్టు ధర్మాసనాలు పాల్గొని అపరిష్కృత కేసులను పరిష్కరిస్తాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. జులై 29 నుంచి ఆగస్టు 3 వరకు ఈ ధర్మాసనాలు విచారణలు జరపుతాయని అన్నారు. సామరస్యంగా పరిష్కారం కాగల కేసులు ఉంటే వాటిని న్యాయవాదులు ప్రత్యేక లోక్ అదాలత్ ముందుకు తీసుకురావాలని ఆయన కోరారు.
'లోక్ అదాలత్లు మన దేశ న్యాయవ్యవస్థలో అంతర్భాగం. వైవాహిక వివాదాలు, ఆస్తి తగాదాలు, మోటారు ప్రమాదాల క్లెయిములు, భూ సేకరణకు సంబంధించిన వ్యాజ్యాలు, పరిహారం, కార్మిక వివాదాలు సంబంధించిన కేసులు కోర్టులో కొండలా పేరుకుపోయాయి. ఈ లోక్ అదాలత్లు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగంగా పనిచేస్తూ ఆ కేసులను తగ్గించేందుకు వీలు కల్పిస్తున్నాయి. కక్షిదారులు తమలో తామే సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకోవడానికి తోడ్పడటం న్యాయమూర్తులకు ఎంతో సంతృప్తి కలిగిస్తుందని' అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
ఈ లోక్ అదాలత్ వ్యవస్థ కంటే ముందు పటియాలా హౌస్లోని ఒక కుటుంబ న్యాయస్థానంలో ఓ జంటకు సంబంధించిన విడాకుల కేసు గురించి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రస్తావించారు. ఆ కోర్టులో భర్త విడాకుల కోసం అర్జీ పెట్టగా, భార్య మెయింటెనెస్స్ కోసం, పిల్లల కస్టడీ కోసం పిటిషన్ వేశారని ఆయన వివరించారు. తరవాత వారిద్దరూ తమకుతాముగా వివాదాన్ని పరిష్కరించుకున్నామని కోర్టుకు తెలిపారని, ఆపైన ఆనందంగా కాపురం చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు.