వరంగల్లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ-నిట్లో విద్యార్థులు గంజాయి తాగి పట్టుబడిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీపావళి పండగ సమయంలో 12 మంది విద్యార్థులు వసతిగృహంలోని.. వారి గదిలో గంజాయి కలిపిన సిగరెట్లను తాగినట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఈ విషయంపై విద్యాసంస్థ అధికారులు నిర్ధారణ కమిటీ వేసి.. విద్యార్థులు కొంత మొత్తంలో గంజాయి సేవించినట్లు ధ్రువీకరించారు. అసలు విద్యాసంస్థ ప్రాంగణంలోకి మత్తు పదార్థాలు ఎలా వచ్చాయనే విషయంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియపరిచామన్నారు. విద్యాసంస్థ సంచాలకుడు ప్రస్తుతం విదేశాలలో ఉన్నందున ఆయన వచ్చిన తర్వాత విద్యార్థులపై తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర పన్నుతున్నారు'