వరంగల్లో ఓ ప్రపంచ స్థాయి టెక్స్టైల్ పరిశ్రమ రూ. 900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానుంది. వరంగల్ టెక్స్టైల్ పార్కులో యూనిట్ స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వంతో కార్పొరేషన్ ఈరోజు తుది ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పరిశ్రమకు అవసరమైన భూ కేటాయింపు పత్రాలను కంపెనీ అందుకుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, యంగ్వాన్ కార్పొరేషన్ ఛైర్మన్ కిహాక్ సుంగ్ కంపెనీ ప్రతినిధి బృందం, భారత్, కొరియా రాయబారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వాన్ కార్పొరేషన్ ఒక యూనిట్గా ఉంటుంది. అందుకోసం 290 ఎకరాల భూమి కేటాయింపు పత్రాలను ప్రభుత్వం అందించింది. స్థానికంగా లభించే అత్యుత్తమ కాటన్ ఉత్పత్తిని ఉపయోగించుకుని ఎగుమతులే లక్ష్యంగా, యంగ్వాన్ వివిధ రకాల టెక్స్టైల్ ఉత్పత్తులను తయారు చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సూమారు 12 వేల మందికి ఉపాధి లభించనున్నదని, యంగ్ వన్ పెట్టుబడి ద్వారా వరంగల్ టెక్స్టైల్ పార్కుకి మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : 'హిందువులకు తెరాస క్షమాపణ చెప్పాలి'