గత నెలలో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. వారం రోజుల నుంచి నీటిని గ్రావిటీ కెనాల్లోకి ఎత్తిపోస్తున్నారు. గోదావరి ప్రవాహంతో కన్నెపల్లి పంప్హౌజ్, మేడిగడ్డ బ్యారేజీ కళకళలాడుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న నీటిని మేడిగడ్డ వద్ద ఒడిసిపట్టి కన్నెపల్లి వైపు మళ్లిస్తున్నారు. కన్నెపల్లి నుంచి పైపుల ద్వారా అన్నారం బ్యారేజీకి తరలిస్తున్నారు.
మూడో పంపు ప్రారంభం
ఈ నెలలోనే కాళేశ్వరం ద్వారా మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోసేందుకు... చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అధికారులు రాత్రింబవళ్లు అక్కడే ఉండి నీటి విడుదలకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ మూడో పంపును ప్రారంభించి నీటిని విడుదల చేశారు. 11 పంపులుండగా... ఇప్పటికే 1వ, 6వ పంపుల ద్వారా గ్రావిటీ కాలువలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో పంపునుంచి 2 వేల 200 క్యూసెక్కుల నీరు పదమూడున్నర కిలోమీటర్లు ప్రవహించి గ్రావిటీ కాలువలోకి చేరుతోంది.
త్రివేణి సంగమం వద్ద ఉద్ధృతి
మరో వారంలోపు ఇంకో మూడు పంపులు ప్రారంభించి... 6 పంపులను వినియోగంలోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్నారం బ్యారేజీకి 2 టీఎంసీలకుపైగా నీరు చేరింది. కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద నాలుగు రోజుల నుంచి గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం నాడు ప్రాణహిత ప్రవాహం కాస్త తగ్గింది. కాళేశ్వరం పుష్కర ఘాట్ల వద్ద 4.21 మీటర్ల మేర ప్రవాహం నమోదైంది.
ఇదీ చూడండి: 'హైదరాబాద్ తాగునీటి కోసం ప్రత్యేక రిజర్వాయర్లు'