నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేటలో భిక్షాటన చేసే ఓ వృద్దుడు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ 1000 రూపాయలు విరాళం అందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. బల్మూర్ మండలం సీతారామపురం గ్రామానికి చెందిన 70ఏళ్ల జంగయ్య అచ్చంపేట బస్టాండ్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అయితే దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికుల వద్దకు వచ్చిన జంగయ్య మొదట జై ఆర్టీసీ అంటూ నినాదాలు చేశాడు. అనంతరం దీక్షా శిబిరంలో బైఠాయించి, తన వద్ద ఉన్న డబ్బులు తీసి ఆర్టీసి కార్మికులకు అందించాడు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తన వద్ద ఉన్న డబ్బులన్నింటిని విరాళంగా అందిస్తున్నానని చెప్పాడు. దీంతో అక్కడున్న వారంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్టీసి కార్మికులు వెంటనే పూల మాలలు తెప్పించి జంగయ్యను ఘనంగా సన్మానించారు.
ఇదీ చూడండి : "విలీనం" మినహా మిగతా డిమాండ్ల పరిశీలనకు కమిటీ