రోడ్డు ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ తాను సైతం అంటూ ముందుకు వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు శిరస్త్రాణం లేని ద్విచక్ర వాహన దారులను కార్యాలయంలోకి అనుమతించడం లేదు. తాజాగా జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కార్యాయలంలో ఇవాళ్టి నుంచి శిరస్త్రాణం లేని ద్విచక్ర వాహనదారులను కార్యాలయం లోపలికి అనుమతించడం లేదు. మూడు, నాలుగు రోజుల పాటు అందరికీ అవగాహన కల్పించి మరింత పకడ్బందీగా అమలు చేస్తామని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ తెలిపారు. రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అందులో శిరస్త్రాణం లేకపోవడం వల్ల చాలా మంది చనిపోయారని తెలిపారు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ముషారఫ్ అలీ వివరించారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ బకాయిల్లో 58 శాతం ఏపీ చెల్లించాలి: ఆర్టీసీ యాజమాన్యం