దిశ హత్యాచార ఘటన దారుణమైందని ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీసీలో సివిల్ సర్వీసెస్ అధికారుల 94వ ఫౌండేషన్ కోర్సు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్...దిశ ఘటన పట్ల తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు.
నిందితులను ఉరితీయాలని బాధ్యాతాయుతమైన ఎంపీలు పార్లమెంటు వేదికగా నినదించారని గుర్తు చేశారు. వీరందరి కోపం, ఉద్వేగం అంతా న్యాయబద్ధమైందేనని పేర్కొన్నారు. 2012 దిల్లీలో ఘోర అత్యాచారానికి గురైన నిర్భయ కేసులో 7 ఏళ్లుగా విచారణ సాగినా... ఇప్పటికీ నిందితులను ఉరితీయలేదన్నారు. చట్టపరంగానే దిశ హత్య కేసు నిందితులకు శిక్ష పడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.