టెక్నాలజీ, గేమింగ్ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేటి తరానికి అందిస్తూ హెచ్ఐసీసీలో బుధవారం ప్రారంభమైన ఇండియా జాయ్ రెండో రోజు విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే బ్రాడ్కాస్ట్లో వస్తున్న మార్పులు... యువతను డిజిటల్ మీడియా ఆకట్టుకుంటున్న తీరుపై పలువురు ప్రముఖులతో నిర్వహించిన ప్యానెల్ డిస్కర్షన్లు అలరించాయి.
వెబ్సీరీస్ల డిజైనింగ్పై చర్చ...
ఈ సదస్సులో సన్ లైఫ్, పిల్లల ఛానెల్స్కి సంబంధించిన ప్రముఖులు పాల్గొని... చిన్నారులను ఆకట్టుకునే రీతిలో సరికొత్త వెబ్సీరీస్ల డిజైనింగ్పై చర్చించారు. ఏవీజీసీఐ సెక్టార్ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. యానిమేషన్ రంగంలో రాణిస్తూ... అద్భుతమైన మార్కెట్ షేర్ని సాధించే విషయమై చేపట్టిన పవర్ ప్లేయర్స్ సెషన్లో యువత ఉత్సాహంగా పాల్గొంది. రెండో రోజు ఇండియా జాయ్లో ఫేస్బుక్ కనెక్ట్, వీఆర్ గేమింగ్కి సంబంధించి ఏర్పాటు చేసిన వర్క్షాప్లు అలరించాయి. పలువురు యువత గేమింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు.
ఇండియా జాయ్లో విదేశీయులకు చోటు...
యువత లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఇండియా జాయ్లో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన యువత భారీగా పాల్గొన్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి ఇండియా జాయ్లో పాల్గొనే వారికోసం ప్రత్యేకంగా గ్లోబల్ యూత్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇందులో భాగంగా దాదాపు 42 దేశాలకు చెందిన యువతీ యువకుల నుంచి వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి... అర్హులైన యాభై మందికి పైగా ఈ ఇండియా జాయ్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. రష్యా, కొరియా సహా దాదాపు 42దేశాలకు చెందిన యువత ఈ కార్యక్రమంలో పాల్గొని వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాల్లో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతకు మరీ ముఖ్యంగా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు పేర్కొన్నారు.
యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఇండియా జాయ్ కార్యక్రమం మరో రెండు రోజుల పాటు నగరవాసులను అలరించనుంది.