రామచంద్ర మిషన్ 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రపంచంలోకెళ్లా అతిపెద్ద ధ్యాన మందిరం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ పంచాయతీ పరిధిలో నిర్మించిన శాంతివనం అందుబాటులోకి వచ్చింది. హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో యోగా గురూజీ బాబారాందేవ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 40 వేల అభ్యాసీలు పాల్గొన్నారు.
హార్ట్ఫుల్నెస్ సంస్థతో కలిసి పనిచేసేందుకు పతాంజలి గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆశ్రమానికి వచ్చే అభ్యాసీల కోసం మూడు విడతలుగా వసంతోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 28 నుంచి 30, ఫిబ్రవరి 2 నుంచి 4, 7 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఫిబ్రవరి 1న రాష్ట్రపతి చేతుల మీదుగా..
శాంతివనాన్ని హార్ట్ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ హెడ్క్వార్టర్గా ప్రకటించింది. ఫిబ్రవరి 2న ఈ కేంద్రాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సందర్శించనున్నారు. ఫిబ్రవరి 1న కోవింద్ రాష్ట్రానికి చేరుకోనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
లక్షమంది ఓకేసారి..
శాంతివనంలో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకోవచ్చు. ఈ మందిర నిర్మాణానికి 2017 డిసెంబరు 25న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఒక పెద్ద ధ్యాన కేంద్రంతో పాటు దాని చుట్టూ 8 ఉప కేంద్రాలను తాబేలు ఆకారంలో నిర్మించారు. 75వ వార్సికోత్సవాలకు వచ్చేవారి కోసం 1,400 ఎకరాల్లో 40 వేల మందికి పైగా వసతి ఏర్పాటు చేశారు. లక్ష మందికి వంటచేసే వంటగదులను నిర్మించారు.
ఇప్పటికే దేశవిదేశాల నుంచి అభ్యాసీలు వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యానంతో మానసిక ఒత్తిడి జయిస్తున్నామని వారు పేర్కొంటున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా.. ఆత్మస్థైర్యం, ధైర్యం ధ్యానంతో సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి