ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో అదరగొట్టింది టీమిండియా. వన్డే టాప్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో సత్తాచాటారు. ఫలితంగా తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో వారి స్థానాలను కాపాడుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా మొదటి ర్యాంకులో కొనసాగుతున్నాడు.
బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో మనోళ్లే టాప్
వన్డే ఫార్మాట్లో బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో కోహ్లీ 886 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ 868 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజామ్ (829) మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఏడు స్థానాలు ఎగబాకి 15కు చేరుకున్నాడు. ఇటీవల మంచి ఫామ్ కనబరుస్తోన్న కేఎల్ రాహుల్ 21 స్థానాలు ఎగబాకి 50వ ర్యాంకుకు చేరుకున్నాడు.
బౌలర్ల విభాగంలో బుమ్రా టాప్
గాయం కారణంగా ఇటీవల కొంతకాలం జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఆసీస్తో జరిగిన సిరీస్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం 764 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), ముజిబుర్ రెహ్మన్ (అఫ్గానిస్థాన్), కగిసో రబాడ (దక్షిణాఫ్రికా), పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఆల్రౌండర్ల విభాగంలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ 304 పాయింట్లతో తొలిస్థానంలో ఉన్నాడు. మహ్మద్ నబీ (అఫ్గానిస్థాన్), ఇమాద్ వాసీం (పాకిస్థాన్) రెండు, మూడు ర్యాంకుల్లో నిలిచారు. ఆసీస్తో జరిగిన సిరీస్లో ఆకట్టుకున్నటీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టాప్-10లో (10) చోటు దక్కించుకున్నాడు.
జట్టు విభాగంలో టీమిండియా 112 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 121 పాయింట్లతో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉండగా, 110 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది.
ఇవీ చూడండి.. 'వారిపై తొలి బంతి నుంచే ఒత్తిడి పెంచుతాం'