మహబూబాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకొంది. ఖమ్మం జిల్లా రఘునాథపల్లికి చెందిన వివాహిత రాధ ఆత్మహత్య చేసుకొంది. భార్యభర్తల మధ్య గొడవలే బలవన్మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి డైరీ ఆధారంగా ఆమె భర్త ఉదయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్ మహబూబాబాద్ ఆర్టీవో కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
'నువ్వు ఇలానే ప్రవర్తిస్తే నా శవమే ఉంటుంది. నీ ప్రవర్తన మార్చుకొని మంచిగా చూసుకుంటావో లేక నా శవన్ని చూస్తావో' అంటూ రాసి ఉన్న డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బయ్యారం గ్రామానికి చెందిన ఉదయ్, ఖమ్మం జిల్లా రఘునాథపల్లికి చెందిన రాధలు ఏడు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లుగా మహబూబాబాద్లోని సుందరయ్యనగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లై ఏడు సంవత్సరాలు గడిచినా తల్లిదండ్రులు కనీసం చూడడానికైనా రాలేదని, కిస్మస్ రోజైనా అమ్మానాన్నల దగ్గరకు వెళ్లాలని నిర్లయించుకుంది రాధ. వీలుపడకపోవడం వల్ల మనస్తాపానికి గురైనట్లు సమాచారం. కొన్నిరోజులుగా భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నట్లు మృతురాలు తన డైరీలో రాసి పెట్టుకుంది.
ఇవీచూడండి: 'మహిళల భద్రతపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలి'