పురపాలక ఎన్నికల తరువాత తెలంగాణలో మద్యం ధరలు పెరుగుతాయని భావించారు. ఎన్నికలు ఆలస్యం కావటం వల్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరల పట్టికను ఆబ్కారీశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం నాడు విడుదల చేశారు. లిక్కర్ క్వార్టర్పై రూ.20లు, హాఫ్పై రూ.40లు, ఫుల్ బాటిల్పై రూ.80లు, స్ట్రాంగ్ బీరుపై రూ.10, లైట్ బీరుపై రూ.20లు, విదేశీ మద్యం సీసాపై రూ.150ల చొప్పున పెంచినట్లు వెల్లడించారు.
మద్యం అమ్మకాలు..
తెంలగాణలో 2018 జనవరి నుంచి డిసెంబర్ చివరినాటికి వరకు రూ.20వేల కోట్ల విలువైన 3 కోట్ల 33 లక్షల కేసుల లిక్కర్, 4 కోట్ల 85 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. 2019 జనవరి నుంచి డిసెంబర్ 15 వరకు 3 కోట్ల 37 లక్షల కేసుల లిక్కర్, 5 కోట్ల వెయ్యి కేసుల బీర్లు అమ్ముడుపోయి... 21 వేల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ నెలాఖరుకు ఇంకో 15 రోజులు ఉండటం వల్ల మరో వెయ్యి కోట్ల రూపాయల విక్రయాలు జరిగి... ఈ ఏడాది పూర్తయ్యే నాటికి 22 వేల కోట్ల వ్యాపారం జరగుతుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
అదనపు ఆదాయం..
ఈ ఏడాది చివరినాటికి 3 కోట్ల 40 కేసుల లిక్కర్, 5 కోట్ల 10 వేల బీరు కేసులు అమ్ముడుపోతాయని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. అంటే 40 కోట్ల 80 లక్షల ఫుల్ బాటిళ్ల లిక్కర్, 61 కోట్ల 20 లక్షల బీరు బాటిళ్లు విక్రయిచే అవకాశం ఉంది. పెరిగిన ధరల ప్రకారం లిక్కర్పై 3 వేల 264 కోట్లు, బీర్ల అమ్మకాలపై 918 కోట్ల ఆదాయం వస్తుంది. సగటున 4వేల 182 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు అదనంగా చేరనున్నాయి. ప్రతి ఏడాది రెండు వేల కోట్ల విలువైన మద్యం అదనంగా అమ్ముడుపోతున్నందున... ఇంతకంటే ఎక్కువ ఆదాయమే సర్కారుకు సమకూరనుందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రభుత్వం మద్యం పాలసీ ప్రకటించాలి: కోదండరాం