బోయింగ్ 737 మాక్స్ విమానాలను అంతర్జాతీయంగా పలు దేశాలు నిషేధించిన నేపథ్యంలో ప్రస్తుత సీఈవోను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. నూతన సీఈవోగా డేవిడ్ కాల్హూన్ను నియమించింది.
వినియోగదారులు, ఇతర వాటా దారులకు, రెగ్యులేటర్లకు సంస్థపై విశ్వాసాన్ని పెంచటమే కాకుండా, వారి మధ్య సంబంధాలను మెరుగుపరచటానికి సీఈవోగా డేవిడ్ను నియమించినట్లు సంస్థ తెలిపింది.
2020 జనవరి 13 నుంచి డేవిడ్ పదవీ బాధ్యతలను స్వీకరిస్తారని ఓ ప్రకటన విడుదల చేసింది బోయింగ్. అప్పటి వరకు కంపెనీ ప్రధాన ఆర్థిక అధికారిగా ఉన్న గ్రెగ్ స్మిత్ తాత్కాలిక సీఈవోగా కొనసాగుతారని పేర్కొంది.
సీఈవో మార్పు ప్రకటన తర్వాత బోయింగ్ షేర్ల విలువ 3.4 శాతం పెరిగాయి.
ఇంతకీ ఏం జరిగింది?
ఇథియోపియా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం అడిస్ అబాబా వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 157 మంది మరణించారు. గతంలో ఇండోనేషియాలోనూ ఇదే శ్రేణి విమానం కూలి 180 మంది మృతి చెందారు.
ఈ నేపథ్యంలో బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలను భారత్తో పాటు యూఏఈ, ఒమన్, న్యూజిలాండ్, ఫ్రాన్స్ దేశాలు నిషేధించాయి. ఈ విమానాల ఉత్పత్తిని వచ్చే నెల నుంచి నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది బోయింగ్.