73 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మారుమూల గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఈ కోవకు చెందినవే మధ్యప్రదేశ్ దిందోరి జిల్లా చిర్పోతీ రైత్ గ్రామ పంచాయతీ పరిధిలోని నవ్ర తోలా, ఘుఘ్రా తోలా.
బైగా గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ గ్రామాలను రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దత్తత తీసుకున్నారు. కానీ... నవ్రతోలా, ఘుఘ్రాతోలా ప్రజలు ఏ చిన్న పని పడినా సమీపంలోని కౌతౌతియా గ్రామానికి వెళ్లాల్సిందే. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత పాఠశాలకూ ఇక్కడికే వెళ్లాలి. కౌతౌతియా గ్రామానికి అనుసంధానం చేస్తున్న రోడ్డు పూర్తిగా కంకరతేలి.. పెద్ద పెద్ద బండరాళ్లతో నిండిపోయింది. అసలు రోడ్డు అని సంబోధించే పరిస్థితులు లేవు అక్కడ. ఈ గ్రామానికి ఎలాంటి వాహనాలు వెళ్లలేవు. ఎవరికైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే అంతే.. అంబులెన్స్ రాదు, కిలోమీటర్ల మేర మోసుకెళ్లాల్సిందే.
" తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాహనాలు వచ్చే పరిస్థితులు లేవు. చాలో రోజుల క్రితం ఈ రోడ్డును నిర్మించారు. రాజకీయ నాయకులు చాలా సార్లు ఇక్కడికి వచ్చారు. రోడ్డు నిర్మిస్తాం, అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు."
- నానబాయి, గ్రామస్థురాలు.
వర్షాకాలంలో అధికం..
వర్షాకాలంలో ఈ గ్రామాల ప్రజల అవస్థలు మరింత ఎక్కువవుతాయి. రోడ్లు మొత్తం బురదతో నిండిపోయి నడవడానికి వీలులేకుండా పోతుంది. ఆ బురదలోనే గ్రామస్థులు సమీప పట్టణానికి చేరుకోవాలి. అందులోంచే విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలి. ఇలా నిత్యం నరకం అంటే ఏంటో చూస్తున్నారు అక్కడి ప్రజలు.
" పాఠశాలకు వెళ్లేప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రోడ్డుపై పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం ఈ రోడ్డును నిర్మించారు."
- లక్ష్మణ్ పరతే, విద్యార్థి.
ఇదీ చూడండి: చెంబు పట్టుకుని బయట తిరిగితే రేషన్ కార్డ్ రద్దు