బిహార్ ముంగేర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఖరగ్పుర్ ప్రాంతంలో నివసించే.. భరత్ కేసరి అనే వ్యక్తి కన్న తల్లి, భార్యతో పాటు తన ముగ్గురు కుమార్తెలను హతమార్చాడు. ఆ తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
అసలు ఏం జరిగింది?
బిహార్ ముంగేర్ జిల్లాలో నివసిస్తున్న భరత్ కేసరి అనే వ్యక్తి గడియారాలను తయారు చేస్తుంటాడు. కొంత కాలంగా అతడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున దారుణానికి ఒడిగట్టాడు. 80 ఏళ్ల వయస్సు ఉన్న తన కన్న తల్లి సహా.. భార్య ఆషా దేవి (45), ముగ్గురు కుమార్తెలైన శివానీ కుమారి (16), సిమ్రాన్ కుమారి (14), సోనమ్ కుమారి(10)లను గొంతునులిమి చంపేసాడు.
నిందితుడి ఆత్మహత్యాయత్నం
ఆ తర్వాత ఇంటిపై కప్పు మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు భరత్. కానీ వేరే వ్యక్తి మీద పడి.. ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటనలో ఆ పొరుగు వ్యక్తికి గాయాలుకాగా.. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు... నిందితుడు భరత్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను శవపరీక్షకు తరలించినట్లు తెలిపారు. నిందితుడు కొద్ది రోజుల నుంచి మానసిక కుంగుబాటు సమస్యతో బాధపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు.
ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'