పాకిస్థాన్లోని సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం గురుద్వారా సాహిబ్ను కలిపే కర్తార్పుర్ కారిడార్కు సంబంధించి భారత్-పాక్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన నియమ నిబంధనలపై ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. యాత్రలో ఏం చేయాలి, ఏం చేయకూడదో పేర్కొంది.
దర్బార్ సాహిబ్ దర్శనానికి రోజుకు 5 వేల మందికి మాత్రమే అనుమతినివ్వనున్నారు. పండుగ వేళల్లో, ఇతర సమయాల్లో అవసరాన్ని బట్టి యాత్రికులు సంఖ్య పెంచే అవకాశం ఉంది.
చేయవలసినవి...
⦁ 13 సంవత్సరాల వయసు లోపు పిల్లలు, 75 సంవత్సరాలపైన వయసు కలిగిన వృద్ధులు.. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలి.
⦁ గురనానక్ దర్శనానికి వచ్చే యాత్రికులు రూ.11 వేలకు మించి వెంట తెచ్చుకోరాదు. 7 కేజీలకు పైగా లగేజీ ఉండకూడదు.
⦁ పర్యావరణ హితమైన వస్తువులు, సంచులు మాత్రమే ఉపయోగించాలి.
⦁ యాత్రకు ఉదయం వచ్చి దర్శనం పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి వెళ్లాలి.
⦁ దర్బార్ సాహెబ్ను దర్శించుకోవాలనుకుంటున్న వారు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ (prakashpurb550.mha.gov.in)ను నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.
⦁ ప్రయాణం చేయాల్సిన రోజుకు నాలుగు రోజుల ముందు రిజిస్ట్రేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా అందుతాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ పత్రం తీసుకోవాలి. పాస్పోర్ట్తో పాటు దీనిని తీసుకెళ్లాల్సి ఉంటుంది.
చేయకూడనివి...
⦁ దర్బార్ సాహెబ్ దర్శనానికి వచ్చే యాత్రికులు సిగరెట్లు, ఆల్కహాలు సేవించరాదు.
⦁ దేవాలయానికి సంబంధించిన వస్తువులను ముట్టుకోకూడదు.
⦁ కేవలం దర్బార్ సాహెబ్ను దర్శించుకోవటానికి మాత్రమే అనుమతి ఉంటుంది. పరిసర ప్రాంతాల చూడటానికి వెళ్లకూడదు.
⦁ ఆలయ ప్రాంగణంలో అనుమతి లేకుండా ఎటువంటి చిత్రాలను తీయకూడదు.
సౌకర్యాల ఏర్పాటు..
యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్ స్థలం, హోటళ్లు, భద్రత, ఇతర భవనాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ భవనాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న ప్రారంభించనున్నారు.
నవంబరు 9న ప్రారంభం...
అంతర్జాతీయ సరిహద్దుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్లోని డేరాబాబానానక్ గురుద్వారా నుంచి కర్తార్పుర్ను కలుపుతూ కారిడార్ నిర్మించారు. గురునానక్ 550వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నవంబర్ 9న ఈ కారిడార్ను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించనున్నారు.
ఇదీ చూడండి:కర్తార్పుర్: భారత యాత్రికులు 20$ చెల్లించాల్సిందే