నీటి కొరత నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. గ్రామాలు, పట్టణాలు మంచినీటి సమస్యతో సతమతమవుతున్నాయి. మంచినీరు లభ్యంకాక కొన్ని ప్రాంతాల వాసులు కాలుష్యమయమైన నీటినే తాగేస్తున్నారు. ఈ కారణంగా వ్యాధుల బారిన పడుతున్నారు సాధారణ ప్రజానీకం. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్కు చెందిన 'హిమాంగి హల్దర్' అనే పాఠశాల విద్యార్థిని వంటింటి వస్తువులతో నీటిని శుద్ధి చేసే ప్రకృతి మిశ్రమం తయారుచేసి అందరినీ అబ్బురపరుస్తోంది. దీనికి 'జల్ అమియా' అనే పేరుపెట్టింది.
ఈ మిశ్రమ తయారీకోసం ఆరు నెలల పాటు పరిశోధన చేసింది హిమాంగి. రసాయనాలు ఉపయోగించకుండా కేవలం ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో ఈ మిశ్రమాన్ని తయారుచేసింది. దీన్ని ఉపయోగించి మురికినీరును తాగునీటిగా మార్చి ఎంచక్కా తాగేయ్యొచ్చు.
"ప్రస్తుతం జలసమస్య పెరిగిపోయి.. తాగేందుకు నీరు దొరకటం కష్టమైపోయింది. ఈ కారణంగా ప్రజలు మురికినీరుని తాగుతున్నారు. దీనివలన పచ్చకామెర్లు, కలరా వంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనాలని అనుకున్నాను. మురికినీటిని ప్రకృతిలో లభ్యమయ్యే పదార్థాలతో తాగునీటిగా మార్చాలనుకున్నాను. ఫలితంగా ఈ జల్ అమియా అనే మిశ్రమాన్ని తయారుచేశాను. "
-హిమాంగి హల్దర్, విద్యార్థిని
మిశ్రమ తయారీ విధానం
ఓ కప్పులోకి కావల్సినంత నిర్మాలీ విత్తనాల పొడి, మునగకాయ, వేప, తులసి ఆకుల పొడి సమాన పాళ్లలో తీసుకొని తగినంత నీరు కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఒక లీటరు మురికినీటిలో 0.005మిల్లీలీటర్ల మిశ్రమాన్ని కలపాలి. నీటిలోని మలినాలను ఈ మిశ్రమం శుద్ధి చేయడం ద్వారా కొంత సమయం అనంతరం దానంటత అదే శుభ్రమైన తాగునీటిగా మారిపోతుంది. ఈ నీటిని తాగడం వలన ఏవిధమైన ప్రమాదం లేదని.. పూర్తి రసాయన రహిత మిశ్రమమని హిమాంగి వెల్లడించారు.
పలువురి ప్రశంసలు..
ఈ మిశ్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో పుణెలో ప్రదర్శన ఏర్పాటుచేశారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఐక్యరాజ్యసమితి కాప్14 సదస్సులో 'జల్అమియ'ను కామన్ వెల్త్ దేశాల ప్రతినిధులు పరీక్షించారు. ఇంట్లో దొరికే గింజలతో నీటిని శుద్ధి చేస్తున్న ఈ మిశ్రమం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. పేటెంట్ హక్కుల కోసం భారత ప్రభుత్వానికి నమూనాని పంపారు.
ఇదీ చూడండి : అయోధ్య తీర్పు: కట్టుదిట్టమైన భద్రత నీడలో దేశం