భారత్తో పాటు ఇతర దేశాలు.. వుహాన్ సహా చైనాలోని తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చైనాలో 23 వేలకుపైగా భారతీయ విద్యార్థులు ఉండగా వారిలో 21వేల మంది వైద్య విద్య అభ్యసిస్తున్నారు. వారిని భారత్కు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ముంబయిలో 423 సీట్లతో కూడిన జంబో విమానాన్ని సిద్ధంగా ఉంచారు. చైనాలోని వుహాన్ నగరం నుంచి తొలి విడతగా శుక్రవారం కొంతమంది భారతీయులను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది భారత్.
విద్యార్థులతో సంప్రదింపులు..
హుబేయ్ రాష్ట్రంలో నివసిస్తున్న 600మంది భారతీయులతో సంప్రదింపులు జరిపి, వారు భారత్కు రావాలనుకుంటున్నారో లేదో తెలుసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ అక్కడి భారతీయుల్లో వైరస్ సోకినట్లు ఎలాంటి కేసూ నమోదు కాలేదని తెలిపింది.
భారత్ నిర్ణయంతో ఊరట!
'శుక్రవారం సాయంత్రం వుహాన్ నుంచి విమానం ద్వారా తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నాం. హుబేయ్లో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి మరో విమానం నడుపుతున్నాం' అని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అక్కడ నివసిస్తున్న భారత విద్యార్థులకు, ఉద్యోగులకు ఊరట కల్పించనుంది.
భారత్ దారిలోనే ఇతర దేశాలు..
తరలింపునకు ఇప్పటికే ఎయిరిండియా 747 బోయింగ్ విమానాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్క భారత్ మాత్రమే కాదు, అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు కూడా వుహాన్ నగరం నుంచి తమ పౌరులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
మరోవైపు ఇప్పటికే చైనాలో ఈ వైరస్ కారణంగా 170 మంది చనిపోగా.. మరో 7వేల మందికిపైగా ఈ వైరస్ సోకింది.
ఇదీ చూడండి: 'కరోనా'తో తీరని వేదన.. సినీ పరిశ్రమ కుదేలు