ప్రస్తుత ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్ జిల్లాలోని సరయూ నది ఒడ్డున వెలసిన అయోధ్య నగరానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. మూడు దశాబ్దాలుగా దేశ రాజకీయాలను మలుపు తిప్పుతోంది.
1 హిందువులకు రాముడి జన్మస్థలి
త్రేతాయుగంలో దశరథ మహారాజు ఏలిన కోసల రాజ్యానికి అయోధ్య నగరం రాజధానిగా విలసిల్లిందని, తమ ఆరాధ్యదైవం శ్రీరాముడి జననం ఇక్కడే జరిగిందని హిందువుల ప్రగాఢ నమ్మకం.
వివాహం చేసుకుని సీతాదేవితో రాముడు రాజధానికి చేరుకోవడం, దంపతుల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి రావడం, రాముడి పట్టాభిషేకం, గర్భిణిగా ఉండగానే సీత అనూహ్యంగా రాజప్రసాదాన్ని వీడటం, అశ్వమేథ యాగం, సీతారాముల పరిణ్యానం అనంతరం కుశుడి పరిపాలన... ఇలా రామాయణంలోని ఎన్నో ప్రధాన ఘట్టాలకు ఈ నగరం సాక్షీభూతంగా నిలిచిందని వారు విశ్వసిస్తారు.
2 జైన, బౌద్దులకూ ప్రత్యేకమే
అయోధ్యలో జైన మత స్థాపకుడు రిషభనాథుడు, బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు ఇద్దరూ కొంతకాలం జీవించారని ఆయా మతాల అనుయాయుల నమ్మకం. కాలక్రమంలో అయోధ్య పేరు సాకేత్గా మారింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు ఇక్కడ స్థూపం సైతం నిర్మించాడు.
3 ముస్లింల దాడులు... బాబ్రీ మసీదు నిర్మాణం
భారత్పై క్రీ.శ.975-1187 మధ్య గజనీ, 1148-1125 మధ్య ఘోరీ చేసిన దండయాత్రలతో దేశంతోపాటు అయోధ్యలోని పలు ఆలయాలు ప్రభావితమయ్యాయి. ఢిల్లీ సుల్తానుల కాలంలో చివరి లోడీ రాజును ఓడించిన బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
బాబర్ ఆదేశంతో ఆయన సైనికాధికారి మీర్బాఖి 1528లో అయోధ్యలో రాముడి ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించినట్లు హిందువులు చెబుతున్నారు. గుడి శిథిలాలపై మసీదు నిర్మించినట్లు మరో వాదనా ఉంది. ఈ కారణంగా అయోధ్య ముస్లింలకూ కావాల్సిన నగరంగా మారింది.
కనౌజ్ నుంచి అవధ్గా రూపాంతరం
రాజులు, రాజ్యాలు మారుతున్న క్రమంలో అయోధ్య ప్రాంతంలో కనౌజ్ రాజ్యం అవతరించింది. క్రీ.శ.11వ శతాబ్దంలో అది అవధ్గా మారింది. తర్వాత ఢిల్లీ సుల్తానుల రాజ్యంలోకి వెళ్లి, దాని పతనం తర్వాత జాన్పూర్లో భాగమైంది. 16వ శతాబ్దంలో మొఘలుల వశమైంది.
మూడో పానిపట్టు యుద్ధం తర్వాత ఈస్టిండియా కంపెనీకి 1764లో అవధ్ సామంత రాజ్యంగా మారిపోయింది. చివరికి బ్రిటిష్ వారు 1856లో తమ సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. అన్నిరకాల హక్కులు కోల్పోయిన నాటి రాజులు 1857లో తొలి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ఓడిపోయారు.
ఈ పరిణామంతో అవధ్ ప్రాంతం 1877లో ఆగ్రా ప్రెసిడెన్సీలో కలిసి నార్త్-వెస్ట్రన్ ప్రావిన్సులో భాగమైంది. తర్వాత అదే ఆగ్రా-అవధ్గా యునైటెడ్ ప్రావిన్సెస్గా మారింది. ఇప్పుడు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ జిల్లాలో కలిసింది.
ఇదీ అయోధ్య (2011 గణాంకాలు)
- నగర జనాభా - 58,890
- అందులో పురుషులు - 31,705
- మహిళలు - 24,185
- అక్షరాస్యత శాతం - 78.15
ఇదీ చదవండి:ఈ చేప ముఖం అచ్చం మనిషిలాగే ఉంది!