ఒడిశా గంజాం జిల్లాలో బహిరంగంగా మలవిసర్జన చేసినందుకు గౌతమి గ్రామంలో 24 కుటుంబాలకు రేషన్ రద్దు చేశారు సర్పంచ్ సుశాంత్ స్వైన్. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
రేషన్ రద్దును గ్రామ పంచాయతీలోని ప్రజలు వ్యతిరేకించినందుకే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు స్వైన్. వీరందరికీ నవంబరు 10లోపు రేషన్ అందుతుందన్నారు.
ఇదీ జరిగింది
అక్టోబర్ 27, 28 తేదీల్లో సంఖేముండి పరిధిలోని గౌతమిలో జాతీయ, రాష్ట్ర ఆహార భద్రతా చట్టాల కింద నెలవారీ రేషన్ను పంపిణీ చేశారు. 24 కుటుంబాలకు మాత్రం రేషన్ ఇచ్చేందుకు నిరాకరించారు స్వైన్. వారంతా బహిరంగ మలవిసర్జన చేస్తుండటమే ఇందుకు కారణం. ఇది మరోసారి పునరావృతం కావొద్దని వాళ్లని సున్నితంగా మందలించారు.
అయితే స్వైన్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చర్యతో వారంతా జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం వారికున్న హక్కును కోల్పోతున్నారని పలువురు తెలిపారు. అధిక శాతం మహిళలు నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
సంఖేముండి పరిధిలోని 400 కుటుంబాలు ఇళ్లలో ఇంకా మరుగుదొడ్లు నిర్మించుకోలేదని బీడీవో(బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్) తెలిపారు. స్వఛ్చ భారత్ కార్యక్రమం కింద 2నెలల్లో వీటి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తామన్నారు.
ఇదీ చూడండి: ఎన్సీపీ నేతకు శివసేన సందేశం..మద్దతు కోసమా?