జాతిపిత మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీమంత్రి, భాజపా ఎంపీ అనంతకుమార్ హెగ్డే. మహాత్ముని నేతృత్వంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటాన్ని నాటకంగా అభివర్ణించారు. అలాంటి వారిని మహాత్మ అని ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు. నాటి స్వతంత్ర పోరాటం బ్రిటిష్ వారి మద్దతుతోనే జరిగిందని చెప్పారు. ఆ నాయకులు ఒక్కసారి కూడా పోలీసుల చేత దెబ్బలు తినలేదని.. అది నిజమైన పోరాటం కాదని వ్యాఖ్యానించారు. గాంధీ నిరాహార దీక్షలు, సత్యాగ్రహం అంతా నాటకమన్నారు. సత్యాగ్రహం ద్వారా స్వాతంత్య్రం రాలేదని.. బ్రిటిష్ వారు విసుగు చెంది స్వతంత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు హెగ్డే.
కాంగ్రెస్ ఆగ్రహం
అనంతకుమార్ హెగ్డే వాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. స్వతంత్రం కోసం జాతిపిత చేసిన పోరాటానికి ఇలాంటి వారి ధ్రువీకరణ అవసరం లేదంది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ శెర్గిల్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ మరో అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ కూడా హెగ్డే వ్యాఖ్యలపై స్పందించారు. ఎల్లవేళలా మహాత్ముని భావజాలాన్ని కొనియాడుతూ అంతర్జాతీయంగా ఖ్యాతి పొందాలని చూసే ప్రధాని నరేంద్ర మోదీ.. హెగ్డే వ్యాఖ్యలపై స్పందించాలని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: కరోనా కల్లోలం: కేరళలో మూడో కేసు నమోదు