పంట వ్యర్థాలను తగులబెట్టడం మంచి విషయం కానప్పటికీ.. దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్యానికి అదొక్కటే కారణం కాదని భాజపా, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. వాయుకాలుష్యం, వాతావరణ మార్పులపై లోక్సభలో చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

వాళ్లలా మనమెందుకు లేము...
వాయు కాలుష్యంపై చర్చలో ముందుగా కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ మాట్లాడారు. ఈ సమస్య ఒక్క దిల్లీకి మాత్రమే పరిమితం కాలేదని.. హిమాలయాల్లోని పలు నదులు, సరస్సులతో పాటు హిమనీనదాలు కూడా కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని ఎలా నియంత్రించాలో బీజింగ్ నుంచి మనం నేర్చుకోవాలన్నారు.

బీజింగ్లో వాయు కాలుష్యాన్ని సమర్థంగా నియంత్రించగలిగినప్పుడు మనం ఆ పనిని ఎందుకు చేయలేమని ప్రశ్నించారు మనీశ్.
రూ.2 కోట్లు ఇవ్వండి..!
దిల్లీలో గాలిని శుద్ధి చేసే టవర్లు ఏర్పాటుకు ఒక్కొక్క ఎంపీ రూ.2 కోట్లు చొప్పున విరాళంగా ఇవ్వాలని భాజపా ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ కోరారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీరుపై మండిపడ్డారు. కాలుష్యానికి రైతులే కారణమనడం సరికాదన్నారు.
"దిల్లీ సర్కారు ఎలాంటి నియమాలను పాటించడం లేదు. దిల్లీలో ప్రజలపై చేసిన ఓ సర్వేలో... 36 శాతం మంది దేశ రాజధానిని వదిలి వెళ్లాలనుకుంటున్నారని తేలింది. కొద్ది రోజుల క్రితం దిల్లీ సీఎం.. ఓ పెద్ద ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ పిల్లలకు మాస్క్లు పంచిపెట్టారు. అయితే ఈ మాస్క్లు కాలుష్యాన్ని లోపలికి వెళ్లకుండా ఆపలేవని ఎయిమ్స్ ఆసుపత్రి తెలిపింది. అయిదేళ్లలో దిల్లీలో వేల చెట్లను నరికివేశారు. ప్రభుత్వ ఆదేశాలతోనే ఇది జరిగింది."
- పర్వేశ్ సాహిబ్ సింగ్, భాజపా ఎంపీ
మాస్క్తో కకోలి ఘోష్...

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలి ఘోష్ ముఖానికి మాస్క్ ధరించే చర్చలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ తరహాలో దేశానికి 'స్వచ్ఛ గాలి' కార్యక్రమం అవసరమన్నారు.