శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఆర్మీ నియామక ప్రక్రియ ఒక తీపి గుర్తుగా నిలిచిపోయింది. జిల్లా కలెక్టర్ నివాస్ ఏర్పాట్లు అన్నీ పక్కాగా చేయించి ఆర్మీ నియామక ర్యాలీ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తిచేశారు. ఈనెల 7 తేదీ అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు ఈ ఎంపికలు జరిగాయి. దీనికి రాష్ట్రం నుంచే కాకుండా యానాం, తమిళనాడుకు చెందిన అభ్యర్థులు హాజరయ్యారు.
వైద్య పరీక్షలకు 4 వేల మందికి పైగా ఎంపిక
ఆర్మీ నియామక ప్రక్రియకు 49 వేల మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ర్యాలీకి 42 వేల 4 వందల 36 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 34 వేల 149 మంది అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ప్రాథమిక పరీక్ష అనంతరం నిర్వహించిన పరుగుపందెంలో 4 వేల 9వందల 42 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వీరందరికీ ధ్రువపత్రాల పరిశీలనతోపాటు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం 4 వేల 4 వందల 24 మంది అభ్యర్థులు వైద్య పరీక్షలకు ఎంపికయ్యారు. ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 28 వరకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
పక్కాగా ఏర్పాట్లు
ర్యాలీలో పాల్గొనేందుకు అభ్యర్థులు కోడి రామమూర్తి క్రీడా మైదానానికి ముందే చేరుకున్నారు. వీరికి రాత్రి రెండున్నర సమయానికి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ర్యాలీ ప్రాంగణానికి అనుమతి ఇచ్చారు. ఎక్కడా జరగని విధంగా శ్రీకాకుళంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయటంతో అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. వీటితో పాటు అభ్యర్థులకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ, అరటిపండ్లను పంపిణీ చేశారు. వీరితో పాటు మరికొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆహార పదార్థాలను అందించారు.
ఇవీ చదవండి..
కార్తిక సోమవారం... అలరారుతున్న శివాలయాలు