కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలాల్లో చదవుకునే విద్యార్థులకు వ్యవసాయం, రైతులు పడే కష్టాలు గురించి తెలియటం అంతంతే. ధాన్యం ఎలా వస్తోందో, కూరగాయలు ఎలా పండిస్తారో వాళ్లకు సరైన అవగాహన ఉండదు. ఇలాంటి అంశాలపై పాఠశాలాల్లో బోధించినా... క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి పరిచయం తక్కువే. అందుకే చిన్నారులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది నెల్లూరులోని ఓ ప్రైవేట్ పాఠశాల.
బురద పొలం.. వరి నాట్లు..!
ఏడో తరగతిలోపు చదవుతున్న విద్యార్థులు పంటల పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆ చిన్నారులు రైతులుగా మారారు. కొందరు పంచెకడితే... మరికొందరూ గోచిపెట్టారు. అమ్మాయిలు చీరలు కట్టారు. పొలంలోకి దిగారు. మట్టి వాసన చూశారు. బురద పొలంలోకి దిగిన ఆ బుడతలు... వరి నారు చేతపట్టారు. పొలంలో బుడిబుడి అడుగులు వేస్తూ కలియ తిరిగారు. వ్యవయసాయమంటే ఎంటో దగ్గర్నుంచి చూశారు.
నెల్లూరు సమీపంలోని ముత్తుకూరు రోడ్డులో రైతులను పలుకరిస్తూ... పచ్చని పొలాల అందాలను ఆస్వాదించారు. ఇలాంటి పర్యటనల ద్వారా... రైతులు పడే కష్టాల గురించే గాక, రోజు తినే ఆహారం ఎలా వస్తోందో విద్యార్థులకు తెలుస్తోందని ఉపాధ్యాయులు అంటున్నారు. భవిష్యత్ తరాలకు వ్యవసాయం గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో తలపెట్టిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఇదీ చదవండి : డ్రోన్ అగ్రి ఉండగా... తెగుళ్ల బాధ ఉండదుగా..!