నెల్లూరుకు చెందిన కమలమ్మ... 35 ఏళ్లు పాలిటెక్నికల్ కళాశాలలో ప్రిన్సిపల్గా పని చేసి... 1990లో పదవీ విరమణ చేశారు. తర్వాత పిల్లల్ని చూసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లారు. అక్కడి విద్యా పరిస్థితులపై అధ్యయనం చేశారు. రాత్రి వేళలో అక్కడివారు 30 నిమిషాల పాటు సాహిత్య పుస్తకాలు చదువుతారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈ అలవాటు ఇక్కడి విద్యార్థులకు అలవాటు చేయాలని సంకల్పించి స్వదేశానికి వచ్చారు. సొంత ఇళ్లు లేకున్నా, వృద్ధాశ్రమంలో ఉంటూనే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన కల్పిస్తున్నారు. తెలుగు నేర్చుకుంటే పరభాషలపై పట్టు వస్తుందని తెలియజేస్తున్నారు. ఆంగ్లం చక్కగా అర్థమయ్యేలా సుమారు 200 పుస్తకాలు రాసి ముద్రించారు. కొండాపురం, కలిగిరి, కావలి ఇలా అనేక పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు ఉచితంగా తను రాసిన పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. విలువలతో కూడిన విద్య, మారుతున్న కాలపరిస్థితులను పుస్తకాల ద్వారా వివరిస్తున్నారు.
పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి
ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఉండాలని విద్యార్థికి పుస్తక పఠనం అలవాటుగా మారాలని కమలమ్మ సూచిస్తున్నారు. చదవంటే రాయటం, మాట్లాడటమే కాదని... జ్ఞానాన్ని ఆకలింపు చేసుకోవడమని చెబుతున్నారు ఈ బామ్మ. ఎక్కువ సమయం పుస్తకాలు, కంప్యూటర్తో గడుపుతున్న ఈమె.. భవిష్యత్తులో యూట్యూబ్ ద్వారా కథలు వివరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముదిమి వయసులోనూ పిల్లలకు చదువు చెప్పడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న ఈ కమలమ్మ జీవితం ఆదర్శనీయం కదూ..!
ఇవీ చదవండి