తుమ్మ అలివేలమ్మకు భర్త, పిల్లలు లేరు. బంధువులున్నా.. ఆమె దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల పెద్దగా పట్టించుకోలేదు. విజయవాడ... గోసాల గ్రామం నుంచి ఆరేళ్ల క్రితం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడికుదురు గ్రామంలోని ఆలయానికి చేరుకుంది. ఆలయం పరిసర ప్రాంతాన్ని శుభ్రపరుస్తూ కాలం వెళ్లదీసేది. ఆలయానికి వచ్చిన వారు తమకు తోచిన సాయం చేసేవారు. అలా వచ్చిన వెయ్యి రూపాయలు కూడబెట్టుకుని.. నడికుదురు గ్రామం ప్రక్కన మోపిదేవి నుంచి విజయవాడ వెళ్లే కృష్ణా నది ఎడమ కరకట్టపై చిన్న పరదాతో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తోంది.
కాళ్లరిగేలా తిరిగినా రేషన్ అందలేదు
అలివేళమ్మకు ఆధార్ కార్డు ఉంది. 3 ఏళ్లుగా.. రేషన్ కార్డు కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా రాలేదు. వితంతు పింఛనూ అందలేదు. తినడానికి తిండి లేక ఒక్కోసారి పస్తులుండేది. ఆమె దీనగాథపై 'గుడిలో చిల్లరతో గుడిసె వేసుకున్నా... ఆధార్ ఆకలి బాధ తీర్చలేదు' అని ఈటీవీ భారత్ కథనం ఇచ్చింది. దీనిపై రేషన్ డీలర్ స్పందించారు.
చొరవ చూపిన ఈటీవీ భారత్ ప్రతినిధి
ఈటీవీ భారత్ ప్రతినిధి అలివేళమ్మ ఆధార్ నెంబర్ ఆధారంగా ఆన్లైన్లో వెతికారు. రేషన్ కార్డు నెంబరుకు ఆధార్ లింక్ అయినట్లు చూపించింది. వెంటనే ఆయన స్థానిక రేషన్ డీలర్ వద్దకు వెళ్లి.. అలివేళమ్మ రేషన్ కార్డు నెంబర్ తెలియజేశారు. ఇపోస్ మిషన్ ద్వారా కార్డు యాక్టివ్లో ఉందని తెలుసుకున్న రేషన్ డీలర్ బామ్మ వేలిముద్రలు తీసుకుని నిత్యావసర సరుకులు అందజేశారు. దీనిపై అలివేళమ్మ సంతోషం వ్యక్తం చేసింది. తన ఆకలి తీరేలా సాయం చేసినందుకు ఈటీవీ భారత్కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే అధికారులు స్పందించి పింఛను ఇప్పించాలని కోరుతోంది.
ఇదీ చదవండి: