ఆప్యాయంగా పలకరించారు.... అప్పులు చేసి పరారయ్యారు! నమ్మకమే పెట్టుబడిగా కొందరు వ్యక్తుల నుంచి సుమారు 4 కోట్ల వసూలు చేసి ఉడాయించారు ఈ దంపతులు. తిరుమలశెట్టి మానస, వెంకటేష్ భార్యభర్తలు. ఏడాది క్రితం గుంటూరులోని కోరిటిపాడు సెంటర్ నాయుడుపేట 1 లైన్లోని ఓ ఇంటికి అద్దెకు వచ్చారు. ఇంతకుముందు హైదరాబాద్లో సాఫ్టువేర్ ఉద్యోగం చేశామని... అక్కడ ఒత్తిళ్లు తట్టుకోలేక వ్యాపారం చేయడానికి గుంటూరు వచ్చామని యజమానితో పాటు బంధువులకు చెప్పారు. తమ మాటలతో కొద్దీ రోజులకే ఇరుగు పొరుగు వారికి బాగా దగ్గరయ్యారు. కొందరిని అమ్మా నాన్న అంటూ, మరికొందరిని అన్నయ్య, తమ్ముడు అంటూ వరసలు కలిపి పరిచయాలు పెంచుకున్నారు. కొన్ని నెలల తర్వాత తమ వ్యాపారానికి కొంత నగదు కావాలని తెలిసిన వారికి, బంధువులకు చెప్పారు. వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయని, ఇచ్చిన మొత్తాన్ని తిరిగిస్తామని నమ్మబలికారు. వెంకటేష్-మానస దంపతుల మాటలను 25 మంది ఇరుగుపొరుగు వారు, బంధువులు నమ్మారు. 30 నుంచి 40 లక్షల చొప్పున సుమారు 4 కోట్ల వరకు సాయం చేశారు.
నెల చివర్లో ఇస్తానని చెప్పి
కొన్నాళ్లకు ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలంటూ వెంకటేష్ని అడగగా... ఇదిగో అదిగో అంటూ ఇంటి చుట్టూ తిప్పించుకున్నాడని బాధితులు అంటున్నారు. అక్టోబర్ నెల చివర్లో కచ్చితంగా ఇస్తామని చెప్పాడని.. తీరా గత నెల 28న ఇంటి నుంచి పరారయ్యాడని చెబుతున్నారు. దంపతులను పట్టుకోవాలని బాధితులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమ డబ్బు తిరిగొచ్చేలా చూడాలని కోరారు.