3 రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా గుంటూరు జల్లా నరసరావుపేటలో వైకాపా నేతలు బహిరంగసభ నిర్వహించారు. మొదట స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభకు మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజిని, లేళ్ల అప్పిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. ఏడు నెలల పాలనలో సీఎం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని సజ్జల అన్నారు. రాష్ట్ర పరిస్థితిని పార్టీ నేతలు ప్రజలకు వివరించాలని సూచించారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని తెలిపారు.
'ఎందుకు గగ్గోలు?'
గత ప్రభుత్వంలో నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలను తుంగలో తొక్కిన మాట వాస్తవం కాదా అని హోం మంత్రి సుచరిత తెదేపాను ప్రశ్నించారు. మూడు పంటలు పండే భూమిని రాజధానిగా ప్రకటించారని అన్నారు. రాజధాని రైతులు ఆందోళనలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చెప్పిన దానికంటే, ఈ ప్రభుత్వం వారి ప్లాట్లను ఎక్కువ అభివృద్ధి చేసి ఇస్తుందని హామీ ఇచ్చారు.
'రైతుల ఉద్యమం.. అభూత కల్పన'
మూడు రాజధానుల ప్రకటన అమల్లోకి రావడం తథ్యం అని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఎంతమంది ఎదురొడ్డినా ఆపలేరని స్పష్టం చేశారు. అమరావతి రైతుల ఉద్యమం అభూతకల్పన అని... అది వ్యాపారుల ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఉద్యమం చేసేవారిలో సగం మంది రైతులు కూడా లేరని.. పోరాటం చేస్తున్న వారిలో పేద రైతులు లేరని అన్నారు.
ఇదీ చదవండి: