జమిలి ఎన్నికలకు వెళ్లాలో లేదో... భాజపా నిర్ణయించుకుంటుందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఆ సమయానికి భాజపాకు అనుకూలంగా ఉందనుకుంటే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కాకుమానులో తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022లో ఎన్నికలు నిర్వహిస్తే... మోదీ మరోసారి ప్రధాని అవడానికి అవకాశం ఉంటుందన్నారు. 2024లో జరిగితే అమిత్ షా ప్రధాని అవుతారనే మాట వినిపిస్తోందని గల్లా చెప్పారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దిల్లీలో ఆంధ్రా గురించి అడగాలంటే తెదేపా ఎంపీలనే అడుగుతారని పేర్కొన్నారు.
రాజన్న రాజ్యం కాదు... రద్దుల రాజ్యం
రాజధాని అమరావతి నిర్మాణం రద్దు చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని గల్లా జయదేవ్ ఆరోపించారు. రాజన్న రాజ్యం కాదని... రద్దుల రాజ్యమని ఎద్దేవా చేశారు. రూ.10 కోట్లతో ప్రజా వేదిక నిర్మిస్తే... దాన్ని కావాలనే నాశనం చేశారని విమర్శించారు. ప్రభుత్వం తెదేపాపై కక్ష సాధింపు కోసమే కూల్చేశారని గల్లా అన్నారు.
ఇదీ చదవండి:'రాజధాని తరలింపుతో ప్రయోజనమేంటి?'