హైదరాబాద్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు సౌరభ్, నిఖిల్ శర్మ.. అత్యాధునిక సాంకేతికతను రాష్ట్ర విద్యార్థుల దరికి చేర్చేందుకు శ్రమిస్తున్నారు. అనంతపురంలోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతికత విశ్వ విద్యాలయ పరిధిలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు.. కొన్ని దేశాలకే పరిమితమైన ఈ సాంకేతికతను.. నేటి తరం విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో సౌరభ్, నిఖిల్ శ్రమిస్తున్నారు. చాలా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రాజెక్టు వర్క్గా చేస్తున్న ప్రయత్నాలు.. విద్యార్థుల భవిష్యత్తుకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదన్న ఆలోచనతోనే.. ఈ ప్రయత్నం చేస్తున్నారు . 700 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఇలా శిక్షణ తీసుకున్న వారిలో ఆగ్ మెంటెడ్, వర్చువల్ రియాల్టీ పరిజ్ఞానంపై ఎక్కవగా ఆసక్తి చూపే నలుగురిని ఎంపిక చేసుకున్నారు. భారతదేశంలోని యువతకు ఈ టెక్నాలజీని నేర్పించి, వీలైనంతమంది ఔత్సాహికులను తయారుచేయాలన్న వారి ఆలోచన నలుగురితో పంచుకున్నారు.
ఆగ్ మెంటెడ్, వర్చువల్ రియాల్టీ పరిజ్ఞానం అంటే మన ఎదుట లేనిది ఉన్నట్లుగా చూపించడమే. ఏదైనా ఓ వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారం అందించటానికి ఆ వస్తువును పలు కోణాల్లో కళ్లెదుట ఉన్నట్లుగా చూపించటమే ఆగ్ మెంటెడ్, వర్చువల్ రియాల్టీ పరిజ్ఞానం. ఇది అమెరికా, కెనడా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో విస్తృత ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుతం ఏఆర్,వీఆర్ పరిజ్ఞానంతో తమ వస్తువులను చూపించి దేశంలోని పలు కంపెనీలు వ్యాపారం అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఈ పరిజ్ఞానం వీలైనంత ఎక్కువ మందికి నేర్పించి, వారిద్వారా ఆగుమెంటేషన్ పరిశ్రమలు స్థాపించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు ఎడురిడ్జ్ సంస్థ వారు చెబుతున్నారు.
ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు ఏఆర్, వీఆర్ సాంకేతికతపై 1400 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు నిర్వాహకులు చెప్పారు. ఇటీవలే అనంతపురం జేఎన్టీయులో విద్యార్థులకు ఏఆర్,వీఆర్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.
తమ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు సొంతగా స్టాటప్ నెలకొల్పేలా చేయడమే లక్ష్యమని ఎడురిడ్జ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చూడండి