కాల్ లెటర్ ఇచ్చి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకుండా తమకు అన్యాయం చేస్తున్నారంటూ గ్రామ సచివాలయాల హార్టికల్చర్ అసిస్టెంట్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధించి కాల్ లెటర్ తీసుకున్న 13 జిల్లాల అభ్యర్థులు విజయవాడ చేరుకుని ఆందోళన బాట పట్టారు. జగనన్న తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు చేతబట్టి ధర్నా చేపట్టారు. స్థానిక ఎంజీ రోడ్డులోని రేడియో స్టేషన్ ప్రాంగణంలో ఉన్న సెల్టవర్ ఎక్కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తమ సమస్య వెళ్లేవరకు పోరాటం చేస్తామని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. నోటిఫికేషన్లో ఇచ్చిన అర్హత మేరకు ఉద్యోగాలు సాధించిన తమను... ఎంపీఈవోగా పని చేసిన అనుభవం లేదన్న కారణం చూపి పక్కన పెట్టేయడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించకపోతే... ఎంతవరకైనా వెళ్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: సచివాలయ ఉద్యోగాల్లో బీజెడ్సీ ఉద్యోగులకు నిరాశ