శాసనమండలి రద్దుకాదని తెదేపా ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ట్వీట్ చేశారు. ఒకవేళ శాసనమండలి రద్దు చేసిన... ఆ నిర్ణయం అమలు అవ్వడానికి 2, 3 ఏళ్లు పడుతుందన్నారు. అప్పటిదాకా శాసనమండలి కొనసాగుతూనే ఉంటుందన్నారు. 2021 కల్లా శాసనమండలిలో వైకాపాకు మెజారిటీ వస్తుందన్న యనమల..అలాంటప్పుడు కౌన్సిల్ రద్దు అవసరం ఏముందని ప్రశ్నించారు. కౌన్సిల్లో 2 బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారన్న ఆయన.. బిల్లులపై నిర్ణయాలకు కనీసం 2, 3 నెలలు పడుతుందని స్పష్టం చేశారు. అయినా కౌన్సిల్ రద్దు చేస్తామనడం మొండితనమే అని విమర్శించారు. వైకాపా ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరించినా తెదేపా ఎమ్మెల్సీలంతా దృఢంగా నిలబడ్డారని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థల రద్దు అనుకున్నంత సులభం కాదని యనమల అన్నారు. ఒక నిర్మాణాత్మక పంథాలో శాసనమండలి ఏర్పడిందన్నారు. ప్రజావేదిక కూల్చినట్లు కాదు.. కౌన్సిల్ రద్దుచేయడమని యనమల రామకృష్ణుడు ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి : టీడీఎల్పీ సమావేశం.. మండలి రద్దు ఊహాగానాలపై చర్చ