రాష్ట్రంలో కొత్తగా మరో 150 పంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ఈ మేరకు జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో ప్రభుత్వం నుంచి వెనక్కి వచ్చిన ప్రతిపాదనలపై... సమగ్ర వివరాలతో మరోసారి పంపాలని భావిస్తున్నారు. పంచాయతీల ఏర్పాటు ఉన్న వాటిలో కొన్ని గ్రామాలు సమీపంలోని పురపాలక సంఘాల్లో చేర్చేందుకు ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ రెండ్రోజుల కిందట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల ముందు 2 వేల జనాభా కలిగిన గిరిజన తండాలను పంచాయతీలుగా చేయడం వల్ల... రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సంఖ్య 13 వేల 53 కు పెరిగింది. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో కొన్ని పంచాయతీల పరిధి ఎక్కువగా ఉన్నందున పరిపాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జిల్లాల నుంచి ప్రతిపాదనలు
గ్రామాలకు పంచాయతీ కార్యాలయాలు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. పంచాయతీకి 3 కిలోమీటర్ల దూరంలో... 3 వేల జనాభా కలిగిన గ్రామాన్ని పంచాయతీ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పట్లో వెలువడిన జీవో ఆధారంగా.. 2014 తర్వాత 150 కొత్త పంచాయతీల ఏర్పాటుకు జిల్లాల ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వివరాలు సరిగా లేవని వాటిని పంచాయతీరాజ్ శాఖ తిప్పి పంపింది. అలా వెనక్కు పంపిన 22తో కలిపి 150 పంచాయతీల ఏర్పాటుకు అధికారులు మరోసారి ప్రతిపాదనలు పంపనున్నారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వివరాలు సేకరిస్తోంది. కొత్త ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
ఇదీ చూడండి: