ఆదాయ పన్ను విషయమై ప్రవాస భారతీయుల్లో నెలకొన్న సందిగ్ధతను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తొలగించారు. ప్రవాస భారతీయులు కేవలం భారత్లో ఆర్జించే సంపాదనకే పన్ను చెల్లించాలని తెలిపారు. ఇతర దేశాల్లో సంపాదించే వాటికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఈ కొత్త పన్ను విధానంపై అధికారులు అయోమయానికి గురికావొద్దని ఆమె కోరారు.
ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఆదాయం పొందవచ్చు.. కానీ వారికి ఇక్కడ ఉండే ఆస్తి నుంచి వచ్చే ఆదాయంపై పన్ను తీసుకునేందుకు మాత్రం తమకు హక్కు ఉందని అన్నారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఆదివారం ఒక ప్రకటన కూడా జారీ చేసింది. భారతీయ పౌరుడు ఇతర దేశాల్లో ఆర్జించిన సంపాదనకు పన్ను విధించం.. కానీ భారత్లో ఉండే వ్యాపారం నుంచి గానీ వ్యాపారం లేదా వృత్తి నుంచి గానీ ఆదాయం పొందితే దానిపై పన్ను విధిస్తామని పేర్కొంది. అవసరమైతే ఈ నిబంధనను చట్టంలో చేరుస్తామని పేర్కొంది.